Sambashana

Telugu News

Chardham Templs: కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలు మూసివేత.. దర్శణం ఎప్పుడంటే..

1 min read

శీతాకాలం దృష్ట్యా ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ్ కేదార్‌నాథ్ ఆలయ తలుపులను బుధవారం మూసివేశారు. సంప్రదాయం ప్రకారం ఉదయం 8.30 గంటలకు పండితులు వేద మంత్రోచ్ఛరణల మధ్య మహాద్వారాన్ని మూసివేశారు. ఎముకలు కొరికే చలిలో ఈ కార్యక్రమంలో 2500 మంది భక్తులు పాల్గొన్నారు. కేదారేశ్వరుడిని పంచముఖి డోలిలో ఉంచి ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ దాదాపు 6 నెలల పాటు కేదార్‌నాథ్‌ని పూజిస్తారు. ఈ ఏడాది 19.5 లక్షల మందికి పైగా భక్తులు కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించినట్లు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు. చార్‌ధామ్‌లలో ప్రధాన పుణ్యక్షేత్రమైన యమునోత్రిని కూడా బుధవారం ఉదయం 11.30 గంటలకు మూసివేసి భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. యమునా దేవిని ఉత్తరకాశీలోని ఖర్సాలీలోని కుషిమఠానికి తీసుకెళ్లారు. గంగోత్రిని మంగళవారం మూసివేశారు. చివరికి బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 18న మూసివేయనున్నారు. అదే సమయంలో కేదార్ నాథ్ పరిసర ప్రాంతాల్లో మంచు కరిగిపోయి చల్లటి గాలులు వీస్తున్నాయి. చార్ధామ్ దేవాలయాలు ప్రతి సంవత్సరం అక్టోబర్-నవంబర్ నుండి ఏప్రిల్-మే వరకు మూసివేయబడతాయి.

ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా కేదార్‌నాథ్‌ని సందర్శించాలని కోరుకుంటాడు. హిమాలయాల మధ్యలో ఉన్న ఈ పవిత్ర ఆలయాన్ని చేరుకోవడం అంత సులభం కాదు. ఇది ఒక అందమైన, ప్రమాదకరమైన ప్రయాణం. అక్కడికి చేరుకుని భగవంతుని దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కానీ, అక్కడికి చేరుకునే మార్గం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. హిమాలయాల దిగువ భాగంలో ఉండటం వల్ల అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఎప్పుడు, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పలేం. ఊహించని వరదలు, ఎన్నో ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 2013లో సంభవించిన వరదల కారణంగా 10,000 మందికి పైగా భక్తులు మరణించారు. మందాకిని మహోగ్ర రూపాన్ని తీసుకుంటుంది.