Sambashana

Telugu News

Israel Hamas War: రెస్క్యూ ఆపరేషన్… 235 మందితో ఢిల్లీకి చేరుకున్న మరో విమానం…

1 min read

Israel Hamas War: హమాస్‌తో కొనసాగుతున్న యుద్ధం మధ్య ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. దీని కింద ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించే ప్రక్రియ కొనసాగుతోంది. 212 మంది భారతీయ పౌరులతో కూడిన మొదటి బ్యాచ్ శుక్రవారం భారతదేశానికి చేరుకుంది. కాగా, ఈరోజు 235 మంది భారతీయులతో కూడిన మరో బృందం ఢిల్లీకి చేరుకుంది. భారతీయులను స్వీకరించేందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఇజ్రాయెల్ నుండి భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా రెండవ విమానం శుక్రవారం సాయంత్రం 5.35 గంటలకు టెల్ అవీవ్ నుండి బయలుదేరింది. దాదాపు 18,000 మంది భారతీయులు ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయారు. భారత ప్రభుత్వం బుధవారం నుంచి ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. భారత పౌరుల భద్రతకు కట్టుబడి ఉన్నామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.

మొదటి బ్యాచ్ 212 మంది పౌరులు శుక్రవారం ఉదయం చార్టర్డ్ విమానం ద్వారా భారతదేశానికి చేరుకున్నారు. ఇజ్రాయెల్ నుండి భారతీయ పౌరులు తిరిగి రావడానికి మొదటి విమానం గురువారం సాయంత్రం 212 మందితో బెన్ గురియన్ విమానాశ్రయం నుండి బయలుదేరి శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. వారి రిటర్న్ ఖర్చులను భారత ప్రభుత్వం భరిస్తుంది. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం తెలిపారు.

గత శనివారం ఉదయం హమాస్ అకస్మాత్తుగా ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. హమాస్ యోధులు ఇజ్రాయెల్‌పై 5000కు పైగా రాకెట్లను ప్రయోగించారు. ఈ దాడిలో 1300 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రజలు మరణించగా, వేలాది మంది గాయపడ్డారు. ఈ దాడి తరువాత ఇజ్రాయెల్ కూడా ప్రతీకారం తీర్చుకుంది. ఇందులో వందలాది మంది హమాస్ ప్రజలు మరణించారు.. వేలాది మంది ప్రజలు గాయపడ్డారు. గత ఏడు రోజులుగా వీరిద్దరి మధ్య వార్ నడుస్తోంది. హమాస్‌పై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేస్తోంది. దాదాపు 3 లక్షల మంది సైనికులు గాజా స్ట్రిప్‌లో మోహరించారు.