Sambashana

Telugu News

BRS MLA: చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ర్యాలీ.. పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ..!

1 min read

BRS MLA: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు సెప్టెంబర్ 22 వరకు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టుపై టీడీపీ శ్రేణులు, మద్దతుదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోనే కాదు హైదరాబాద్, బెంగళూరు, విదేశాల్లో చంద్రబాబుకు మద్దతుగా పలువురు నిరసనలు తెలుపుతున్నారు. ఆదివారం హైదరాబాద్ వనస్థలిపురంలో చంద్రబాబుకు మద్దతుగా భారీ ప్రదర్శన జరిగింది. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ ర్యాలీలో వందలాది మంది మద్దతుదారులు పాల్గొన్నారు.

చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా జెండాలు ప్రదర్శించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ నిరసనల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీకి హాజరై టీడీపీ మద్దతుదారులకు సంఘీభావం తెలిపారు. ఈ ర్యాలీలో బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి కూడా పాల్గొన్నారు. కానీ వనస్థలిపురం ప్రాంతంలో ఏపీ సెటిలర్లు పెద్ద సంఖ్యలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. కానీ అనుమతి లేకపోవడంతో ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కొంతమంది ఆందోళనకారులను కూడా అదుపులోకి తీసుకున్నారు.