Sambashana

Telugu News

Minister KTR: ఇవాళ వికారాబాద్ లో కేటీఆర్ రోడ్‌ షో

తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో పటిష్టంగా ముందుకు సాగనుంది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా అభ్యర్థులంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని గులాబీ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారంలో బిజీగా ఉన్నారు. దీంతో పాటు రోడ్ షోలతో ప్రజల్లోకి వెళ్లి తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తున్నారు.

అలాగే ఇందులోభాగంగా మంత్రి కేటీఆర్ ఇవాళ వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాల్లో ఆయన రోడ్ షోలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఇప్పటికే నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓ వైపు ఎన్నికల ప్రచారంలో మరోవైపు కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసేందుకు కొత్త హామీలు ఇస్తోందని విమర్శించారు. హస్తం పార్టీకి అధికారం కట్టబెడితే భస్మాసురుడిదే అధికారం అని మంత్రి కేటీఆర్ ప్రజలకు చెబుతున్నారు. కాగా, వికారాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ రోడ్ షో వివరాలు ఇవీ.. ఉదయం 11 గంటలకు చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యకు మద్దతుగా రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వికారాబాద్ నగరంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తో కలిసి రోడ్ షో చేస్తున్న కేటీఆర్.. మధ్యాహ్నం 3 గంటలకు మర్పల్లి మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో చేస్తారు.