Sambashana

Telugu News

Harish Rao: మంత్రి హరీశ్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

1 min read

Harish Rao: తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కారును పోలీసులు తనిఖీ చేశారు. సిద్దిపేట నుంచి మరోసారి బరిలోకి దిగిన హరీశ్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి తెల్లవారుజామున బయల్దేరారు. మార్గమధ్యంలో పోలీసులు హరీష్ రావు కారును ఆపి తనిఖీ చేశారు. మంత్రి హరీశ్ కారును పోలీసులు ఆపి అసెంబ్లీ ఎన్నికల నిబంధనల ప్రకారం విచారణ చేపట్టారు. హరీశ్‌రావు తన మద్దతుదారులు, బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి పోలీసులకు పూర్తిగా సహకరించారు. మంత్రి కారుతో పాటు ఆయన ప్రయాణిస్తున్న ఇతర వాహనాలను కూడా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేశామని… అదే క్రమంలో మంత్రి కాన్వాయ్‌ని కూడా అడ్డుకున్నామని పోలీసులు తెలిపారు. సహకరించిన మంత్రికి పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల తనిఖీ అనంతరం మంత్రి కాన్వాయ్‌ కొండగట్టు ఆలయం వైపు వెళ్లింది. కొండగట్టు ఆంజనేయస్వామి చెంతకు నామినేషన్ పత్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం మంత్రి హరీశ్‌రావును ఆలయ అర్చకులు ఆశీర్వదించారు.

స్వామి ఆశీస్సులతో మళ్లీ సిద్దిపేటలో బంపర్ మెజారిటీతో విజయం ఖాయమని… బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల నిజామాబాద్‌లో సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ని కూడా పోలీసులు తనిఖీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో జరుగుతున్న జన ఆశీర్వాద సభకు హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో వెళ్లగా.. ఆయన కాన్వాయ్ రోడ్డు మార్గంలో వెళ్లింది. తిరుగు ప్రయాణంలో కాన్వాయ్‌తో కూడిన వాహనాలు నిజామాబాద్ మీదుగా హైదరాబాద్‌కు వస్తుండగా, నిరసన ప్రదేశంలో కేసీఆర్ కాన్వాయ్ తనిఖీ చేశారు. దీంతో పాటు మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల వాహనాలను కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తారతమ్యం లేకుండా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.